ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు.. జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య సంచలన వ్యాఖ్యలు

  • అందుకనే దేశంలో గోవధ కొనసాగుతోందని ఆరోపణ
  • యూపీ నుంచే అత్యధికంగా గొడ్డుమాంసం ఎగుమతి అవుతోందని ఆవేదన
  • తిరుమల లడ్డూ వివాదంపై శంకరాచార్య విచారం
జ్యోతిర్‌మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్రపతి ద్రౌపదిముర్ము హిందువులు కాదని, కాబట్టే దేశంలో ఇప్పటికీ గోహత్య కొనసాగుతోందని పేర్కొన్నారు. గతంలో అయోధ్య రామాలయం విషయంలోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నిర్మాణమే పూర్తికాని రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. తాజాగా, మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్రధాని, రాష్ట్రపతి అసలు హిందువులే కాదని, ఇప్పటి వరకు అత్యున్నత పదవులు అధిష్ఠించిన వారెవరూ హిందువులు కాదని సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో గోహత్య కొనసాగుతుండడానికి అదే కారణమని విమర్శించారు.

ఉత్తరప్రదేశ్‌లో మహంత్ యోగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ గొడ్డుమాంసం ఎగుమతులు ఆ రాష్ట్రం నుంచే అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. తిరుమల లడ్డూ వివాదంపై స్పందిస్తూ గొడ్డుమాంసం కలిగి ఉన్న ప్రసాదాన్ని కోట్లాదిమంది భక్తులకు పంచడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అది హిందువులను దెబ్బతీసే కుట్ర తప్ప మరోటి కాదన్నారు. దీనిపై త్వరగా దర్యాప్తు పూర్తిచేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

Narendra Modi
Droupadi Murmu
Jyotirmath Shankaracharya

More Telugu News